ఆలేరు ఎంఎల్ఎ బీర్ల ఐలయ్య భూ కబ్జాలు ఎపిసోడ్లుగా బయటకు వస్తున్నాయని మాజీ ఎంఎల్ఎ, బిఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత అన్నారు. గతంలో కొలనుపాకలో భూ కబ్జా బాగోతం బయట పెట్టామని చెప్పారు. తాజాగా ఆలేరు రెవెన్యూ తండాలో బీర్ల ఐలయ్య భూ దందాలకు తెరలేపారని ఆరోపించారు. 1996లో 16 ఎకరాలు కొందరు ఎస్టిలకు అసైన్డ్ భూములు కేటాయించారని, అందులో రెండు ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులకు అమ్మారని, అందులో కొన్ని ఎకరాలు నవంబర్ 2024లో కుమార స్వామి,బాలరాజు అనే వ్యక్తులకు జిజిఎ చేశారని పేర్కొన్నారు. కుమార స్వామి ఎంఎల్ఎ బీర్ల ఐలయ్య డ్రైవర్ కాగా …బాలరాజు అయన పిఎ అని, వారిద్దరి పేరిట జిపిఎ అయిన కొన్ని రోజులకే ఆ భూములను అమ్మేశారని తెలిపారు. తెలంగాణ భవన్లో గొంగిడి సునీత మీడియాతో మాట్లాడారు.
అసైన్మెంట్ భూములు అమ్మడానికి కొనడానికి వీలు లేదని, అలాంటప్పుడు ఎంఎల్ఎ అసైన్మెంటు భూములతో వ్యాపారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ భూములు కొన్న వారు కూడా ఐలయ్య బంధువులే అని ఆరోపించారు. ఎంఎల్ఎ ఐలయ్య బంధువులు కొన్న భూములకు డిసెంబర్లో నాలా కన్వెర్షన్ కూడా జరిగిందని, వెంటనే ఈ సేల్ డీడ్స్ రద్దు చేసి అసలైన హక్కుదారులైన గిరిజనులకు భూములు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. చదువురాని అమాయక గిరిజనుల భూములపై ఎంఎల్ఎ కన్నేసి భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ నేతలపై చిన్న చిన్న అంశాలపై కేసులు పెట్టే ప్రభుత్వం బీర్ల ఐలయ్య విషయంలో చోద్యం చూస్తోందని చెప్పారు. అధికార పార్టీ ఎంఎల్ఎ ఏ తప్పు చేసినా చర్యలు ఉండవా..? అని నిలదీశారు. భూ దందాల్లో సిఎం రేవంత్రెడ్డిని ఎంఎల్ఎలు ఫాలో అవుతున్నారని, యధా రాజా తదా ప్రజా అన్నట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. బీర్ల ఐలయ్య భూ దందాలు మరిన్నిటిని త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు.