గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ హరీష్రావు కారుకు అడ్డు రాగా, వారికి ఆయన బాసటగా నిలిచారు. పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్లా బతుకుతారు అంటూ హరీష్రావు అధికారులపై మండిపడ్డారు. బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు.
ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చారని, ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా అంటూ అధికారులు నిలదీశారు. 20,30 ఏళ్ల నుండి ఇక్కడి దుకాణాలపైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిపై దెబ్బకొట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. హరీష్ రావు అధికారులను నిలదీయడంతో కమిషనర్ హుటాహుటిన ఘటన వద్దకు చేరుకుని కూల్చివేతలు నిలిపి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ బాసటగా నిలిచిన మాజీ మంత్రి హరీష్రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.