నీటి ఎద్దడిని, భూగర్భ జలాలు తరిగిపోతున్న సమస్యను ఎదుర్కొంటున్న మరో ఐదు రాష్ట్రాలకు అటల్ భూజల్ యోజనను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా ఈ పథకాన్ని విస్తరించే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పంజాబ్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఓ రిపోర్టును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.జలశక్తి మంత్రిత్వ శౠఖ పరిధిలోని జల వనరులు, నదీ అభివృద్ధి, గంగానది పునుజ్జీవన శాఖ, ఐదు అదనపు రాష్ట్రాల్లో అమలు చేయడానికి రూ. 8200 కోట్ల వ్యయంతో అటల్ భూజల్ యోజన విస్తరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ‘సూత్రప్రాయంగా’ ఆమోదం లభించిందని జలవనరులపై స్టాంటింగ్ కమిటీకి తెలియజేసింది.
ఈ పథకాన్ని కేంద్ర ప్రాయోజిత పథకం(సిఎస్ఎస్)గా పునర్నిర్మించవచ్చనే షరతుతో తెలియజేసింది. అటల్ భూజల్ యోజనను కేంద్ర రంగ పథకంగా మార్చడానికి ఐదు రాష్టాలు అనుమతి ఇవ్వాలని గత ఏడాది ఆగస్టులో కోరినట్లు బిజెపి ఎంపి రాజీవ్ ప్రతాప్ రూడీ అధ్యక్షతన జరిగిన ప్యానెల్కు ఆ శాఖ తెలిపింది. అంతేకాక పంజాబ్ ఇప్పటికే తన ఆమోదం తెలిపిందని, ఇతర రాష్ట్రాల స్పందనల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. అటల్ భూజల్ యోజన 2020 ఏప్రిల్ నుంచే పనిచేస్తోంది. ఇప్పటికే హర్యానా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లో కవర్ చేస్తోంది. ఈ పథకం ఐదేళ్ల వరకు పనిచేస్తుంది. ఈ పథకం ప్రధాన లక్షం భూగర్భ జలాలను వివిధ పద్ధతుల ద్వారా మెరుగుపరచడం, పరిరక్షించడం.