Wednesday, February 12, 2025

గాజాను కొనడం కాదు …స్వాధీనం చేసుకుంటాం : ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : గాజాను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 తో భేటీ అయిన ట్రంప్ , ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ‘ మేము గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తాం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన నాకు లేదు. మధ్య ప్రాచ్యం లోని ప్రజలకు అనేక ఉద్యోగాలు సృష్టించనున్నాం’ అని ట్రంప్ ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో తెలిపారు.
2 వేల మంది పిల్లలను తీసుకుంటాం…
యుద్ధం కారణంగా అనారోగ్యంతో , క్యాన్సర్‌తో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను తమ దేశానికి తీసుకువెళతామని అబ్దుల్లా 2 ప్రకటించారు. దీనిని ట్రంప్ అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. అయితే , నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించాలనే ప్రతిపాదననను మాత్రం జోర్డాన్ రాజు తిప్పి కొట్టారు. వారిని అక్కడి నుంచి పంపించకుండా గాజాను తిరిగి నిర్మించాలన్నారు. ట్రంప్ ప్రతిపాదనపై అరబ్ దేశాలు రియాద్‌లో చర్చిస్తాయన్నారు. అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను గత వారం తొలిసారి ట్రంప్ బయటపెట్టారు.

నాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తో భేటీ తరువాత ఆయన ఈ ప్రకటన చేశారు. దానిని స్వాధీనం చేసుకొని ఓ వెకేషన్ ప్రదేశంగా (రివేర) అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. నాడు నెతన్యాహు కూడా దీనిని ఓ విప్లవాత్మక ఆలోచనగా అభివర్ణించారు. హమాస్ మాత్రం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పు పట్టింది. పాలస్తీనాలో గాజా విడదీయలేని భాగంగా స్పష్టం చేసింది. ఈ ప్రకటనకు ముందు గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. దీనికి నిరాకరిస్తే అమెరికా నుంచి అందే సాయం నిలిపివేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యం లోనే అబ్దుల్లా 2 ట్రంప్‌తో భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News