Sunday, March 16, 2025

కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని..ఇంటి గేటును ఎత్తుకెళతారా..?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అప్పు కింద ఆడబిడ్డల పుస్తెల తాళ్లను కూడా జమచేయించిన దుష్ట చరిత్ర కాంగ్రెస్‌ది అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఆ దరిద్రపు ఆనవాయితీనే తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. బ్యాంక్ లోన్ కట్టలేదని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన పాడి రైతు ప్రేమలత ఇంటి గేటును బ్యాంకు సిబ్బంది ఎత్తుకుపోవడంపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంతటి అరిగోస పడ్డరో అలాంటి పరిస్థితే మళ్లీ తెలంగాణలో దాపురించిందని విమర్శించారు.

ఒకనాటి కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పులు కట్టకపోతే ఇండ్ల దర్వాజలు, కరెంటు మోటర్లు, స్టార్టర్లను అధికారులు ఎత్తుకుపోయేవారని అన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్నన్ని రోజులు రైతులను కడుపులో పెట్టుకుని సాదుకున్నారని గుర్తుచేశారు. లోన్ కట్టకపోతే ఇంటి గేటును తీసుకురావాలని చెప్పిన అధికారులకు, దొంగలకు పెద్ద తేడా లేదని పేర్కొన్నారు.పేదలపై చూపిస్తున్న ఈ ప్రతాపాన్ని పెద్దలపై చూపించగలరా..? అని ప్రశ్నించారు. బడాబాబులకు కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేస్తున్న బ్యాంకులు, పేదల విషయంలో మాత్రం వడ్డీ వ్యాపారుల్లాగా వారి రక్తం తాగుతున్నాయని ఆరోపించారు.

పరిస్థితుల ప్రభావంతోనే రైతులు లోన్లు కట్టలేకపోతున్నారని చెప్పారు. రేవంత్ మాత్రం పదవిని కాపాడుకోవడానికి అడ్డమైన పనులు చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఎవరి మీదనన్నా కేసు పెట్టాలంటే రైతుంలదరికి 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తమను పీక్కు తింటున్న కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకరాలను రైతులు చూస్తూ ఊరుకోరని,కాంగ్రెస్ నాయకులను తమ ఇంటి గేటు కూడా తొక్కనీయరని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News