Saturday, February 22, 2025

బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. అయితే విదేశీ భాషపై అధికంగా ఆధారపడుతున్న విషయాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా విద్యార్థులకు తమ మూలాలపై అవగాహన తగ్గుతోందని అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ విద్యావిధానంలో ప్రయత్నం జరిగిందని వివరించారు. తమకు నచ్చిన భాషను ఎంచుకునే స్వేచ్ఛకు జాతీయ విద్యావిధానం ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉందని గుర్తు చేశారు.

రాజకీయ కారణాలతో జాతీయ విద్యావిధానాన్ని తమిళనాడు లోని అధికార డీఎంకే పార్టీ వ్యతిరేకించడాన్ని ఆయన లేఖలో తప్పుపట్టారు. ఈ విధానంపై ప్రభుత్వం హ్రస్వదృష్టితో వ్యాఖ్యలు చేస్తోందని, రాజకీయ లక్షాల కోసం పురోగామి విధానాలను ప్రమాదాలుగా చూపించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తమిళభాష అజరామరమైనదని చెన్నైలో ప్రధాని మోడీ అన్న మాటలు గుర్తు చేశారు. తమిళ భాష ,సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యావిధానంతో రాజకీయం వద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రధానికి స్టాలిన్ లేఖ
అంతకు మునుపు , తమిళనాడు సీఎం ప్రధాని మోడీకి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టించింది. మూడు భాషల బోధనతో ఉన్న జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోతే కేంద్రం నిధులు వదులుకోవాల్సి వస్తుందంటూ ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరిస్తున్నారని తమిళనాడు సిఎం లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం దృష్టా సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కేంద్రం రూ. 2154 కోట్ల నిధులను
విడుదల చేయాలని కోరారు. అయితే ఈ లేఖపై కేంద్ర మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడు సీఎంకు ప్రత్యుత్తరమిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News