హైదరాబాద్: సోషల్మీడియా వాడకం పెరిగిపోయినప్పటి నుంచి దాని వల్ల ఎంత మంచి జరిగిందో.. అంతే చెడు జరిగింది అనడంలో తప్పు లేదు. దాన్ని సక్రమంగా వినియోగించే వాళ్లు ఉన్నారు.. దుర్వినియోగం చేసే వాళ్లూ ఉన్నారు. ఇలా దుర్వినియోగం చేసే వారిలో బెట్టింగ్ యాప్ల వాళ్లు ముందు వరుసలో ఉంటారు. కొందరు యూట్యూబర్లను కూడా ఈ బెట్టింగ్ యాప్ల నుంచి డబ్బు తీసుకొని వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇది చూసిన వాళ్ల ఫాలోవర్లు.. ఆ బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడిపోతున్నారు.
ఓవైపు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వాలు ఎంత చెప్పిన.. కొందరు మాత్రం అది పెడ చెవిన పెడుతున్నారు. అలాంటి యూట్యూబర్కు ఆర్టిసి ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న యూట్యూబర్ లోకల్బాయ్ నాని.. తరచూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపై సజ్జనార్ మండిపడ్డారు. లోకల్బాయ్ నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఎపి డిజిపిని కోరారు. డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయి.. కానీ బెట్టింగ్ భూతాలను ప్రమోట్ చేసి ప్రజలను చెడగొట్టవద్దని సజ్జనార్ అన్నారు. యువతను బెట్టింగ్ యాప్లను బానిసలుగా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి చేస్తే.. చట్టప్రకారం శిక్షలు తప్పవని మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు.