ఉప్పల్: విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్ ద్వారక నగర్ కు చెందిన ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్ లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం క్లాస్ రూమ్ లో పిటి ఆంజనేయులు వచ్చి సదరు విద్యార్థిని మందలించడంతో తీవ్రంగా కొట్టాడు. మనస్తాపానికి గురై క్లాస్ టీచర్ కి వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి సంగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
వెంటనే స్కూల్ కరస్పాండెంట్ దగ్గర లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి విద్యార్థిని తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు చనిపోయాడని తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూలుకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూల్ యజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు, స్కూలు విద్యార్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.