దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టి.. బంగ్లా బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించాడు.
అయితే ఈ మ్యాచ్లో మాత్రం షమీ కాస్త తడబడ్డాడు. తొలి ఓవర్లోనే ఐదు వైడ్లు వేసి.. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే అత్యధికంగా ఐదు అదనపు పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో జింబాబ్వే బౌలర్ టినాషే మొదటి స్థానంలో ఉన్నాడు. 2004లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఇతను ఏకంగా ఏడు వైడ్ బాల్స్ వేశాడు.
ఇక భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే హార్థిక్ పాండ్య వేసిన 8వ ఓవర్లో బాబర్ ఆజామ్(23) రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ ఇమామ్ రనౌట్ అయ్యాడు. దీంతో కష్టాల్లోపడ్డ జట్టును కెప్టెన్ రిజ్వాన్తో కలిసి షకీల్ ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో షకీల్(54) అర్థ శతకం నమోదు చేయగా.. రిజ్వాన్ 42 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.