కరాచీ: శ్రీలంక జట్టుపై పాకిస్థాన్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. ఆ దేశంలో పర్యటించేందుకు ఇతర దేశాల క్రికెట్ జట్లన్ని వెనకడుగు వేశాయి. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ చేసిన చాలా ప్రయత్నల కారణంగా పలు జట్లు పాకిస్థాన్లో సిరీస్లు ఆడాయి. అయితే దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్లో తొలి ఐసిసి టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. భారత్ మినహా మిగితా జట్లు అన్ని పాకిస్థాన్లోనే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి.
అయితే టోర్నమెంట్ ప్రారంభమై వారం రోజులు కూడా కాకముందే పాక్లో ఉగ్రవాద సంస్థలు తమ వక్రబుద్ధిని బయటపెట్టాయి. ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేస్తూ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది. దీంతో పాకిస్థాన్ మొత్తం హైఅలర్ట్లోకి వెళ్లిపోయింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు వచ్చే అతిథులను తరీక్-ఏ-తాలిబన్, ఐసిస్తో పాటు బలుచిస్థాన్కు సంబంధించిన పలు ఉగ్రమూకలు కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందని సమాచారం. దీంతో పాకిస్థాన్లోని ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి అతిథ్యమిస్తున్న పాకిస్థాన్ జట్టు టోర్నమెంట్లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగిపోవడంతో ఆ మ్యాచ్ను కూడా చేజార్చుకొని సెమీస్ ఆశల్ని కోల్పోయింది.