ప్రయాగ్రాజ్: 144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 60 కోట్ల మందికి పైగా ఈ వేడుకలో పాల్గొని పవిత్రస్నానాలు చేశారు. అయితే ఆ ఆధ్యాత్మిక ఉత్సవం బుధవారంతో ముగియనుంది. మరోవైపు అదే రోజు మహా శివరాత్రి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో యోగి సర్కార్ భక్తులకు కొత్త ఆంక్షలు విధించింది.
కుంభమేళకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది సర్కార్. భక్తుల రద్దీ దృష్ట్యా గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు మళ్లీ పునారావృతం కాకుండా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. నిత్యవసరాల కోసం వచ్చే వాహనాలనే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు తమ సమీప ఘాట్లలోనే పవిత్రస్నానాలు చేయాలని స్పష్టం చేశారు. ఉచిత ఆహారం, వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.