దుబాయ్: టీం ఇండియా మాజీ ఆటగాడు శిఖర్ ధవన్ బ్యాటింగ్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా ‘గబ్బర్’ అని పిలుస్తుంటారు. అయితే గత ఏడాది ఆగస్ట్లో అతను క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధవన్ మరోసారి టీం ఇండియా డ్రెస్సింగ్ రూంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఇండియా.. ఆదివారం దాయాది పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. అయితే 2023 ఐసిసి ప్రపంచకప్ నుంచి బిసిసిఐ మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్కి మెడల్ ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ అనంతరం కూడా ఈ మెడల్ను ప్రదానం చేయడానికి ధవన్ను జట్టు ఆహ్వానించింది. ఈ మెడల్ రేసులో అక్సర్ పటేల్, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ ఉండగా.. మెడల్ అక్సర్కు దక్కింది.
పాక్తో జరిగిన మ్యాచ్లో అక్సర్ ఒక క్యాచ్ అందుకొని రెండు రనౌట్లు చేశాడు. ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్ని డైరెక్ట్ హిట్ ద్వారా అక్సర్ చేసిన రనౌట్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. డ్రెస్సింగ్ రూంలోకి ధవన్ రాగానే జట్టు సభ్యులందరూ ఆయన్ని చప్పట్లతో ఆహ్వానించారు. అనంతరం ఆటగాళ్లతో ధవన్ ముచ్చటించారు. మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, శ్రేయస్, గిల్లను ధవన్ అభినందించాడు. అనంతరం మెడల్ను ఆయన అక్సర్కు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.