ప్రఖ్యాత భారతీయ నటి శృతి హాసన్… డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్కు పరిచయం కాబోతోన్నారు. గురువారం నుండి మార్చి 2 వరకు హార్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను ప్రదర్శించే 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం చేసే ప్రయాణమే ఈ ‘ది ఐ’. చనిపోయిన తన భర్తను తిరిగి తీసుకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిగా ఉండబోతోన్నాయని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చకునేందుకు భార్య చేసిన త్యాగాలు ఏంటి? ప్రయత్నాలు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
గ్రీస్, ఏథెన్స్, కోర్ఫులోని అందమైన లొకేషన్లో చిత్రీకరించిన సీన్లు ఆడియెన్స్ను మెప్పించేలా ఉన్నాయి. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది ఐ’ని ప్రదర్శించిన తర్వాత ఈ ప్రాజెక్ట్పై అందరిలోనూ మరింతగా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ.. “సైకలాజికల్ థ్రిల్లర్లు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోని ప్రొడక్షన్ హౌస్లో ఈ ప్రాజెక్ట్ను రూపొందించడం విశేషం. చలనచిత్ర పరిశ్రమలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది” అని అన్నారు. డాఫ్నే ష్మోన్ మాట్లాడుతూ.. ‘ది ఐ సినిమాలోని పాత్ర శృతి హాసన్కు అద్భుతంగా అనిపిస్తుంది. ఎమోషన్స్, సంఘర్షణ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ను చూపించే డయానా పాత్రలో శృతి హాసన్ చక్కగా నటించారు”అని తెలిపారు.