ముంబై: ప్రముఖ సినీ నటి కియారా అడ్వాణీ 2023లో నటుడు సిద్ధార్త్ మల్హోత్రాని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట తమ అభిమానులకు ఓ శుభవార్త అందించింది. త్వరలో కియారా తల్లి కాబోతున్నట్లు సోషల్మీడియాలో ప్రకటన చేసింది. అది కూడా వినూత్నమైన రీతిలో చిన్న పిల్లలు ధరించే సాక్సులను కియారా, సిద్ధార్త్ ఇద్దరు తమ చేతిలో పట్టుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘తమ జీవితంలో త్వరలోనే ఓ అద్భుతమైన బహుమతి రానుంది’ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. దీనిపై అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, వివాహం తర్వాత కూడా కియారా, సిద్ధార్త్లు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో కియారా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు ఆమె గర్భం దాల్చడంతో కమిట్ అయిన మూవీస్కి కొంతకాలం దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక సిద్ధార్త్ కూడా గత ఏడాది ‘యోధ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ ఏడాది ‘పరమ్ సుందరి’ అనే సినిమాతో అభిమానుల్ని అలరించనున్నాడు.