Saturday, March 1, 2025

విషాదంలోనూ మంత్రుల వినోదం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు హెలికాప్టర్ యాత్రలు.. చేపకూర విందులు చేసుకుంటుంటే, హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ‘అన్నం వండలేదు గుడిలో తినండి’ అని విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్‌టి బాలుర హాస్టల్ సిబ్బంది ఆదేశాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు.

అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి హాస్టల్ సిబ్బంది వంట చేయడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా..? అని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News