ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం
కేటాయిస్తాం ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం
అభివృద్ధి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా
ఉంటుంది : మంత్రి శ్రీధర్ బాబు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్’ను మహిళల కోసం అభివృద్ధి చేస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పా ర్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ లక్డీకాపూల్ రెడ్హి ల్స్ లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ) భవన్ లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘రౌండ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంఎస్ఎంఈ
(ఎంఎస్ఎంఈ) 2024: ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ‘కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే దళితులు..దళితులు అంటేనే కాంగ్రెస్ అని, దళితుల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు సం క్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని, 2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4500 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.
వీటిలో రూ.2200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రావాలని, తాము అధికారంలోకి రాగానే ఈ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించామని, వచ్చే నెల(మార్చి) చివరి నాటికి రూ.300 కోట్లు చెల్లిస్తామన్నారు. దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారని, కానీ దురదృష్టవశాత్తు ఇప్పటీ వరకూ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా పాలసీ అంటూ ఏదీ లేదన్నారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు మేం ప్రత్యేకంగా పాలసీని తీసుకువచ్చామని, క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిపుణులను భాగస్వామ్యం చేసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పాలసీని రూపొందించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోరిక మేరకు వారికి మరింత ప్రయోజనం చేకూరేలా ఈ పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ను తయారు చేస్తామన్నారు. ప్రొక్యూర్ మెంట్, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తామని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రత్యేక పాలసీలను తీసుకువస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడించారు.
పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తామని, కొత్త ఆలోచనలతో ముందుకువచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బ్యాంక్ ల నుంచి రుణాలు పొందడంలో ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు కుటీర పరిశ్రమలకు అండగా నిలుస్తామని, వాటిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తమిళనాడు, కర్ణాటకలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందన్నారు. ఆయా ప్రభుత్వాలు దళిత పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాకాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుందని, ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కడియం శ్రీహరి, రాంచందర్ నాయక్, మందుల సామెల్, వెడ్మ భోజ్జు, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.