కృష్ణా జలాల్లో తెలంగాణకు
న్యాయమైన వాటా కేటాయించాలి
70శాతం పరీవాహక ప్రాంతమున్నా
34శాతం నీటిని కేటాయించడం
వివక్షే గోదావరి నికర జలాల్లోనూ
మా వాటా ఎంతో చెప్పండి శ్రీశైలం,
సాగర్లో టెలీమెట్రీ ఏర్పాటు ఖర్చు
మేమే భరిస్తాం పాలమూరు
రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్
బ్యారేజికి అనుమతులు ఇవ్వండి
గోదావరిపై ఎపి అక్రమంగా నిర్మిస్తున్న
బనకచర్లను అడ్డుకోండి కేంద్ర
జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు
సిఎం రేవంత్రెడ్డి వినతి సీతారామకు
నిధులివ్వాలని కోరాం : మంత్రి ఉత్తమ్
మన తెలంగాణ/హైదరాబాద్ :కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరీవాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉం టే కేవలం 30 శాతం మాత్రమే ఎపిలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు.గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఎపి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యా రు.
కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలోనూ ఆయా వివరాలను సిఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తెలియజేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణ లో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి) పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్కు 66, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఏళ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణా నది నీటిని ఎపి తరలించుకుపోకుండా చూడాలన్నారు.
టెలీ మెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలి
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలీ మెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో తెలియజేశారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డిపిఆర్ సమర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని సిఎం తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టిఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి ఎపి ప్రభుత్వం కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబి), కెఆర్ఎంబిల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదన్నారు.
50 సంవత్సరాలు పాటు వడ్డీలేని రుణాలను తెలంగాణకు ఇవ్వాలి
గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదని సిఎం రేవంత్ కేంద్రమంత్రితో పేర్కొన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తాము నష్టపోతామని, కృష్ణా డెల్టా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అఫెక్స్ కౌన్సిల్లోనూ ఎపి గోదావరి -బనకచర్ల ప్రాజెక్టు ఎటువంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రితో సిఎం వివరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడికుంట వాగు, చనాఖా కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టం), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబిపి) పిఎంఆర్పీ 2024 కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందజేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాలు పాటు వడ్డీలేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపి రఘువీర్ రెడ్డి, సిఎం కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయ్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరాం: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిందని, అవసరమైతే తెలంగాణనే ఆంధ్ర వాటా ఖర్చు భరిస్తామన్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరామని, కేంద్రమంత్రి సిఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు.