వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు మరో సారి నోటీసులు పంపారు. 2019లో ఆయన తీసిన ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీపై అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మరోసారి బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతకు ముందు జారీ అయిన నోటీసు పై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగానే ఆర్జీవీకి సీఐడీ నుంచి ఇప్పుడు మరోసారి నోటీసులు అందాయి. ఈ కేసుకు సంబంధించి గుంటూరు సీఐడీ అధికారులు గత నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు డుమ్మా కొట్టి, తన న్యాయవాదిని సీఐడీ ఆఫీస్కు పంపించారు. సినిమా పనులతో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, తనకు 8 రోజుల గడువు కావాలని కోరారు.
కానీ సీఐడీ అధికారులు మరో సారి నోటీసులు పంపించడం గమనార్హం. 2019లో ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం టైటిల్ పై కొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ’అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. అయితే, యూట్యూబ్ లో మాత్రం ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతోనే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారని చెప్పారు. దీంతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్ 29న కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టి గడువు కోరారు.