ములుగు జిల్లా, వాజేడు మండలం, సుందరయ్య కాలనీ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం రెండు రోజుల కిందట ఘనంగా జరిగింది. పెళ్ళి జరిగిన మరుచటిరోజే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సుందరయ్య కాలనీకి చెందిన అక్కిశెట్టి ఏసుబాబు (48), భార్య కుమారి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు హరికృష్ణ, చిన్న కుమారుడు శివకృష్ణ ఉన్నారు. పెద్ద కుమారుడి వివాహం ఈ నెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కలివేరు గ్రామంలో సోమవారం వైభవంగా జరిగింది.
వివాహం అనంతరం సుందరయ్య కాలనీలో గల ఇంట్లో మంగళవారం సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేసుకున్నారు. వ్రతం రోజున ఏసుబాబుకు అనారోగ్యంగా ఉండటంతో మొదట ఏటూరునాగారంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుండి వరంగల్ ఎంజిఎంకు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకు పెళ్ళి జరిగిన రెండోరోజే తండ్రి మృతి చెందటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృత దేహంపై పడి భార్య, కొడుకులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.