మరో మూడు కేసుల్లో రాజా సింగ్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బిజెపి శాసనసభ్యుడు టి.రాజాసింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యా యి. కాగా గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్పై 2022లో పోలీసులు పిడి యాక్ట్ పెట్టారు. 2022 ఫిబ్రవరి 19న మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా పిడి యాక్ట్ ప్రయోగించారు. అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎంఎల్ఎపై పిడి యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మతపరమైన కామెంట్లు చేశారనే ఆరోపణలతో రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ టైమ్లో 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదని రాజాసింగ్ రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించిం ది. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్ కావడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై లోగడ నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు. పిడి యాక్ట్ ప్రయోగించేందుకు అనుకూలంగా మంగళ్హాట్, షాహినాయత్గంజ్ స్టేషన్లలో నమోదైన కేసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుల్లో రాజాసింగ్ నిర్దోషిగా తేలారు. గత శుక్రవారం ఆయనపై ఉన్న విద్వేషపూరిత ప్రసంగం కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆయనపై ఐదు పోలీస్ స్టేషన్లలో విద్వేష పూరిత ప్రసంగం కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు వాటిని కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.