గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళా సంఘాలకు వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లించకుండా మోసం చేసిన చరిత్ర మీదన్న సంగతి అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు గుర్తుంచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. గత ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు రూ.3,485 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.409 కోట్లు మాత్రమే చెల్లించి మిగిలింది ఇవ్వకుండా నయవంచనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజా ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం మంత్రి మాట్లాడుతూ హరీశ్రావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. హరీష్రావు ఆర్థిక మంత్రిగా చివరి మూడేళ్లలో మహిళా సంఘాల వడ్డీల కోసం నయా పైసా చెల్లించకుండా మహిళలకు మూడేళ్లు గుండు సున్నా పెట్టి పోయారని ఆరోపించారు.
పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతం కావడంతో కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని హరీష్ రావు అబద్ధాలు వల్లే వేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, మహిళలు అప్పుల పాలవుతూ ఆగం అవుతున్నారని హరీష్ రావు ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు మీరేం చేయలేదన్న విషయం మహిళలందరికీ తెలుసునని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో మీ ఆడబిడ్డ కవిత ఒక్కరే ఎదిగారు తప్ప రాష్ట్రంలో మహిళలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలైనా, బీసీ ఉద్యమమైనా, మహిళా ఉద్యమమైనా కవితే హైజాక్ చేస్తారని అన్నారు. కవిత తప్ప ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దు అన్నది బిఆర్ఎస్ లక్ష్యమని మంత్రి సీతక్క వివరించారు. అందుకే లక్ష మంది తరలివచ్చి మహిళా సభను సక్సెస్ చేస్తే మీరు ఓర్వ లేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభయ హస్తతం డబ్బు దిగమింగిన చరిత్ర మీదే
ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసుకున్న అభయహస్తం డబ్బులను దిగమింగిన చరిత్ర మీదైతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకు పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించామని తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి వడ్డీలు మహిళలకు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రమాదవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ప్రమాద బీమా ఇవ్వాలన్న ఆలోచన మీరు చేయలేదని తెలిపారు. కానీ తాము మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని తెలిపారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు వ్యవరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా మీ బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఎవరు మహిళా సంక్షేమం కోసం కోసం ఎంత చేశారో తేలుస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని చెబుతూ ఒక లక్ష్యం నిర్దేశించుకుని మహిళలను కోటీశ్వరులు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహిళల గురించి హరీశ్రావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.