నేడు నామినేషన్ల పరిశీలన
13 వరకు ఉపసంహరణకు గడువు
ఆ తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా
ఎన్నికైనట్లు వెల్లడించనున్న ఇసి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్,శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం అసెంబ్లీలో నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంఎల్ఎలు, సిపిఐ నేతలు హాజరయ్యారు. బిఆర్ఎస్ పార్టీ తరపున దాసోజు శ్రవణ్కుమార్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, తలసాని శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
సోమవారం(మార్చి 10)తో నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగియనుండగా.. ఒక్క రోజు ముందు కాంగ్రెస్, బిఆర్ఎస్తో పాటు సిపిఐ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో సోమవారం ఆయా పార్టీల ఎంఎల్సి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఐదు ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరుగనున్నాయి.
ఈనెల 29తో ఎంఎల్ఎ కోటాలోని 5 ఎంఎల్సి స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. కాగా, ఐదు స్థానాలకు ఐదు మంది అభ్యర్థులు ఎంఎల్ఎల సంతకాలతో నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు ఇండిపెండెంట్లు ఒక్క ఎంఎల్ఎ సంతకం లేకుండా నామినేషన్ వేశారు. మంగళవారం(మార్చి 11) అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత అభ్యర్థులు అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వెల్లడించనుంది.