ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై ఉభయ సభల్లో నిలదీయండి ప్రజా
సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలి బిసి రిజర్వేషన్లు, ఎస్సి రిజర్వేషన్ల బిల్లుకు
మద్దతుగా గొంతు వినిపించాలి బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలకు పార్టీ అధినేత
కె.చంద్రశేఖర్రావు పిలుపు ఉభయసభల్లో సమన్వయం కోసం డిప్యూటీ లీడర్లను
నియమిస్తామని వెల్లడి తెలంగాణ భవన్లో కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ శాసన
సభాపక్ష సమావేశం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బిఆర్ఎస్ సభ్యులు ఉభయ సభలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దళితబంధును నిలిపివేయడంపై నిలదీయాలి. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి.
కెసిఆర్, బిఆర్ఎస్ అధినేత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై అసెంబ్లీ, శాసనమండలిలో చీల్చి చెండాడాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని చెప్పారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, శాసనమండలిలో పోరాడాలని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదచారి, ఎంఎల్సి కవితతోపాటు ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పలు అంశాలపై కెసిఆర్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్టీ శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరుకావాలని సూచించారు. బిసి రిజర్వేషన్లు, ఎస్సి రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని, రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డి.ఎల పెండింగ్, పిఆర్సి అమలుపై అసెంబ్లీ, శాసనమండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు కొట్లాడాలని అన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని చెప్పారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్పులు విడుదల చేయకపోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలని సభ్యులకు దిశానిర్ధేశం చేశారు. దళితబంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలని సూచించారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బిఆర్ఎస్ సభ్యులు ఉభయ సభలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
మూడు గంటల పాటు సాగిన సమావేశం
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. సభలో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.