రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో శనివారం(మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపనున్నారు. 2024- 25 విద్యా సంవత్సరంలో ఆఖరి రోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అన్ని పాఠశాలలు అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.