కేంద్రంలో బిజెపి చిత్తశుద్ధి లేని పాలనను కొనసాగిస్తుందని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో శుక్రవారం వేణు, చరణ్, శ్రీకాంత్ యాదవ్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపి చామల కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పనిచేశారని, బిజెపిలో చేరిన ఆయనకు ప్రస్తుతం ఆ పార్టీ పాలన పై అవగాహన లేదని ఎంపి చామల విమర్శించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఇచ్చిన గుర్తింపు బిజెపిలో ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డి గుర్తింపు కోసమే 14 నెలల కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతున్నారని స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
నిజానికి 11 ఏళ్లుగా కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని పాలన చేస్తుంది బిజెపి అని, ఈ విషయంలో ముందుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీరుపై మాట్లాడాలని ఎంపి చామల సూచించారు.దేశవ్యాప్తంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి, ఆ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ వాటా 80 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సామాన్యుడు ఏదైనా లోన్ కట్టకపోతే అరెస్టు చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. అసలు తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతుందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఎంపి చామల ఆరోపించారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని ఎంపి చామల స్పష్టం చేశారు.