హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఎమ్మెల్యేలు హరీశ్రావు, కెటిఆర్లపై విమర్శలు చేశారు. బిఆర్ఎస్కు స్టేచర్ పట్ల ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదని మండిపడ్డారు.
‘‘ఆనాడు అధికార పార్టీగా బిఆర్ఎస్కు స్టేచర్ ఉండేది. 2023 డిసెంబర్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా స్టేచర్ ఇచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చి మార్చురీకి పంపించారు. బిఆర్ఎస్ నేడు మార్చురీలో ఉందని చెప్పాను.. అందులో తప్పేముంది. బిఆర్ఎస్ మార్చురీలో ఉందని నేను చెబితే.. పెద్దాయన కెసిఆర్ను నేను అన్నట్లుగా కెటిఆర్, హరీశ్రావు చిత్రీకరించారు. అంత కుంచిత స్వభావం నాకు లేదు. చంద్రశేఖర్రావు వద్ద ఉన్న కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను కూర్చొబెట్టారు. చంద్రశేఖర్రావు వద్ద తీసుకోవడానికి ఇంకేముంది. వారి వద్ద ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా.. ఆ హోదా కెటిఆర్ లేదా హరీశ్రావుకు కావాలి. తప్పుడు మాటలు నాకు ఆపాదిస్తున్నారు. నేను ఆలా కోరుకోవడం లేదు. కెసిఆర్.. వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి.. నేను ఇక్కడనే ఉండాలి. చంద్రశేఖర్రావు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి ’’ అని రేవంత్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.