ముంబయి: మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ‘ఛావా’ సినిమానే కారణమని ఆయన అన్నారు. సోమవారం శంభాజీనగర్లో ఉన్న ఔరంగజేజు సమాధిని కూల్చివేయాలని కొందరు డిమాండ్ చేస్తూ.. నిరసన చేపట్టారు. ఈ నిరసన కాస్త హింసకు దారి తీసింది. దీంతో పోలీసులు నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో కర్య్ఫూ విధించారు.
దీనిపై అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాను తప్పుబట్టడం లేదు.. కానీ, ఛావా సినిమా శంభాజీ మహరాజ్ చరిత్రను ప్రజల ముందుంచింది. అదే సమయంలో కొందరి మనోభావాలను రగిలించాయి. కాబట్టే వాళ్లు ఔరంగజేబు మీద వ్యతిరేకత బయటకు వచ్చింది’’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా రూపొందిన ‘ఛావా’ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ఘన విజయం సాధించడమే కాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.