నేనే సీనియర్..నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అప్లయ్..అప్లయ్ నో రిప్లయ్ అన్నట్లుగా ఇక్కడ నడుస్తోందన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని నేను నా రెగ్యులర్ స్టైల్ లో వెళ్లి పగలగొట్టానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే స్థలానికి పక్కన ఉన్న మరికొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం ల్యాండ్ ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయాని, కానీ ఆ పక్కనే ఉన్న ఈద్గా మైదానంలో లోకల్ ఎమ్మెల్యే అయిన తన దృష్టికి తేకుండానే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారన్నారు.
అందుకే తనకు వేరే ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టానన్నారు. అలాగే మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు ఎగ్స్ ఇవ్వడం లేదని, ఆ పిల్లలకు మనం ఎగ్స్ ఇవ్వాలి కదా అన్నారు. నా నియోజకవర్గం పరిధిలోని అంశాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నోట్ చేసుకుంటామని చెప్పడం కాదన్నారు. నూతన భవనాల నిర్మాణాల విషయంలో సోషల్ మీడియాలో చిన్నచిన్న పత్రికలతో బ్లాక్ మెయిల్ లో చేస్తున్నారని, వీరికి జీహెచ్ఎంసీ అధికారులు వణికిపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా స్పందించరు కానీ సోషల్ మీడియా పర్సన్స్ ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని అన్నారు. ఆ తర్వాత అధికారులు వారు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.