Tuesday, April 29, 2025

హెచ్‌సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

పోలీసులకు డిప్యూటీ సిఎం భట్టి ఆదేశాలు
న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు
తీసుకోవాలని ఆదేశం జుడీషియల్
రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసులో
తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన
అంతకుముందు మంత్రుల కమిటీతో హెచ్‌సియు
టీచర్స్ అసోసియేషన్ భేటీ క్యాంపస్‌లో
పోలీసు బలగాలను ఉపసంహరించి
నిషేధాజ్ఞలు తొలగించాలని ప్రొఫెసర్ల డిమాండ్
బలగాల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం
ఆ మేరకు వైస్‌ఛాన్సలర్‌కు భట్టి లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సమావేశం సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మంత్రులు దుదిల్లా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సబ్ కమిటీతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం(యుహెచ్‌టిఎ), పౌర సంఘాల ప్రతినిధులు సమావేశమై పలు డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. హెచ్‌సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్‌తో సబ్ కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం డిప్యూటీ సిఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.

డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన మంత్రుల కమిటీ

హెచ్‌సియు క్యాంపస్ నుండి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని, ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని హెచ్‌సియు టీచర్స్ అసోసియేషన్, పౌర సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇప్పటికీ పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని మంత్రుల కమిటిని కోరారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చక పోవడంతో విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదని యుహెచ్‌టిఎ, సివిల్ సొసైటీ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని తెలిపారు. కాగా, యుహెచ్‌టిఎ, సివిల్ సొసైటీ ప్రతినిధుల డిమాండ్లపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, పేర్కొన్న 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసుల పహారా తప్పనిసరి అని త్రిసభ్య మంత్రుల కమిటీ తెలిపింది. క్యాంపస్‌లోని మిగిలిన ప్రాంతాల నుండి పోలీసులను ఉపసంహరించుకోవాలనే అంశం గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు ప్రభుత్వం నుంచి లేఖ రాస్తాయని పేర్కొంది. విద్యార్థులు, వసతి గృహాల భద్రత గురించి విసి హామీ ఇచ్చిన తర్వాత, 400 ఎకరాల్లో మినహా, క్యాంపస్ నుండి పోలీసులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌కు సంబంధించి, హెచ్‌సియు విద్యార్థులపై దాఖలైన కేసుల పట్ల సానుభూతితో కూడిన దృక్పథానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది.

అంతే కాకుండా, సాధ్యమైనంత త్వరగా కేసుల ఉపసమహారణకు పోలీసు శాఖ, న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, తదుపరి కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరిని 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని స్పష్టం చేసింది. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి కమిటీ అనుకూలంగా ఉందని, కానీ సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న దృష్ట్యా న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంత్రుల బృందం రాలేదని చెప్పింది. అయితే ఈ విషయంపై విద్యార్థుల సూచనలు, సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ సిసి, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్య భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్,ఎన్‌ఎపిఎం, వి.సంధ్య, డబ్లూటిజెఎసి ప్రతినిధులు కె.సజయ, ఇమ్రాన్ సిద్ధిఖీ, సిడబ్లూఎస్ -ఇండియా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News