Tuesday, April 8, 2025

బద్లాపూర్ నిందితుడి ఎన్‌కౌంటర్ కేసు

- Advertisement -
- Advertisement -

బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ముంబై : గత ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్ర లోని ఠాణె జిల్లా బద్లాపూర్ లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. ఎదురు కాల్పుల కేసుపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల్లో పాల్గొన్న ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుత ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. కేసులో సదరు పోలీసులపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. ఇటువంటి చర్యలు రాష్ట్ర చట్టబద్ధతను, నేర న్యాయ వ్యవస్థపై సామాన్యుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించింది.

నిందితుడి మృతి వెనుక ఉన్న కుట్రను సిట్ వెలికి తీస్తుందని నమ్ముతున్నట్టు తెలిపింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చట్ట నిబంధనలకు కట్టుబడి దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవడం పోలీసుల విధి అని పేర్కొంది. అయితే ఈ కేసును రాష్ట్ర సిఐడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని, విస్తృత దర్యాప్తుకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలియజేశారు. సీఐడీ దర్యాప్తు ముగిసిన తర్వాత సంబంధిత కోర్టుకు నివేదికను సమర్పిస్తాయని అన్నారు.

బద్లాపూర్ పాఠశాలలో చోటు చేసుకున్న అత్యాచార సంఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితుడు అక్షయ్ శిండే (23)పై అతడి మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు తలోజా జైలుకు వెళ్లామని పోలీసులు చెప్పారు. , అక్కడి నుంచి నిందితుడిని కారులో తీసుకొని బద్లాపూర్ కు బయలుదేరగా ముంబ్లా బైపాస్‌కు చేరుకున్న సమయంలో కారులో ఉన్న పోలీస్ అధికారి తుపాకీని లాక్కొన్న అక్షయ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడని వివరించారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఓ పోలీస్ అధికారి నిందితుడిపై కాల్పులు జరిపినట్టు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. అనంతరం జరిగిన మెజిస్ట్రేట్ విచారణలో పోలీసుల కస్టడీలో నిందితుడు మరణించినందున అతడి మరణానికి వారిని బాధ్యులుగా నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News