టిజిపిఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలు దేశంలోనే పెద్ద కుంభకోణమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రిలిమ్స్లో ఓ హల్ టిక్కెట్, మెయిన్స్లో మరో హాల్ టికెట్ ఇవ్వడం ఏంటని, ఇక్కడే కుంభకోణం మొదలైందన్నారు. బిఆర్ఎస్ హయాంలో పేపర్ లీకైతే పరీక్షలు రద్దు చేశామని, కాంగ్రెస్ హయాంలో లీకైతే ఎందుకు రద్దు చేయరు..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారని, ఈ అవకతవకలపై ఆయన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అ సెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్కు అతీగతీ లేదని విమర్శించారు. తెలంగాణ పట్ల కెసిఆర్కు ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదని యువత గ్రహించాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ అవకతవకలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
654 మందికి ఒకేలా మార్కులు ఎలా వచ్చాయి…?
21 వేల 93 మంది పరీక్షలు రాస్తే, 21 వేల 103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని పాడి కౌశిక్రెడ్డి అడిగారు. పది మంది అదనంగా ఎక్కడ్నుంచి వచ్చారో తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోఠి కళాశాలలోని 18,19వ సెంటర్లలో 1,490 మంది పరీక్ష రాస్తే 74 మంది ఎంపికయ్యారని, 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే 69 మంది మాత్రమే ఎంపికయ్యారని అన్నా రు. 654 మందికి ఒకేలా మార్కులు ఎలా వచ్చాయని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్సి రాములు నాయక్ కోడలికి 206 రాంక్ వచ్చిందని, ఎస్టి కేటగిరీలో ఆమెకు మొదటి రాంక్ వ చ్చిందని తెలిపారు. ఆమె సెంటర్ నెంబర్ 19లో పరీక్షలు రాశారని, 18, 19 సెంటర్లు కోఠి ఉమెన్స్ కళాశాలలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆ సెంటర్లలో మహిళలకే అవకాశం ఇచ్చారని, మహిళలకే సెంటర్లు ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది పరీక్షలు రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయని, తెలుగు మీడియంలో 7,800 మంది రాస్తే 70 మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఇంత తక్కువ ఎలా వస్తాయని అడిగారు. పూజిత రెడ్డి అనే అభ్యర్థిని రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంటే మార్కులు తగ్గించారని చెప్పారు. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్లో 100 మార్కులు అని ప్రెస్నోట్లో ప్రకటించి 123 మార్కులు తర్వాత వేశారని, ఇదేమని అడిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి మార్కులు తగ్గించారని ఆరోపించారు.