Monday, April 21, 2025

జెఇఇ నిర్వహణలో ఎన్‌టిఎ ఫెయిల్

- Advertisement -
- Advertisement -

‘కీ’ విడుదలలోనూ పిల్లిమొగ్గలు అర్ధరాత్రి ఫలితాలతో
హడావుడి తుది ఫలితాల ప్రకటనలో జాప్యం పరీక్షల
నిర్వహణలో ఎన్‌టిఎ తీరుపై విమర్శల వెల్లువ
తల్లిదండ్రులు, విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్న
నిర్వహణ సంస్థ

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటిలు, ట్రిపుల్ ఐటీల్లో బి.ఇ, బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జెఇఇ మెయిన్ 2025 రెండో విడత ఫలితాలు అర్థరాత్రి విడుదల కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేయగా, అదేరోజు అర్థరాత్రి విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోర్‌తో ఫలితాలను విడుదల చేసింది. తొలుత గురువారమే జెఇఇ మెయిన్ రెండో సెషన్ పేపర్ -1కు సంబంధించిన తుది కీని ఎన్‌టిఎ విడుదల చేసినప్పటికీ.. కొద్దిగంటల్లోనే తొలగించింది. ఇందుకు కారణమేంటో తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌టిఎ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

కాగా, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది కీ విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఎదురుచూశారు. అయితే, తుది కీని సైతం చెప్పిన సమయం కన్నా గంటకు పైగా ఆలస్యంగా విడుదల చేయడంతో ఎన్‌టిఎ తీరుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మరోసారి తుది కీని విడుదల చేసిన ఎన్‌టిఎ, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్లు పేర్కొంది. జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం ఈనెల 17 నాటికి ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. నిర్ణీత గడువులోగా ఫలితాలు వెల్లడించడంలోనూ ఎన్‌టిఎ విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై శుక్రవారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించిన ఎన్‌టిఎ.. శనివారం(ఏప్రిల్ 19)లోగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించి, అదేరోజు అర్థరాత్రి ఫలితాలను విడుదల చేసింది.

ఎన్‌టిఎ తీరుపై విద్యార్థుల అసహనం

జెఇఇ మెయిన్ పరీక్ష విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తీరుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కీ విడుదల, ఫలితాల వెల్లడిలో ఎన్‌టిఎ విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తోంది. పరీక్ష జరిగిన తర్వాత కీ ఎప్పుడు విడుదల చేస్తారో.. ఫలితాలు ఎప్పుడు విడుదలు చేస్తారనే అంశంపై ఎన్‌టిఎ స్పష్టత ఇవ్వడం లేదు. దాంతో ఎన్‌టిఎ తీరుపట్ల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఏటా లక్షలాది మంది విద్యార్థులు అనేక నెలలు శ్రమించి ఈ పరీక్షలకు హాజరవుతుంటారు.

ఎంతటి ప్రతిభావంతులైనా ఈ ఎంట్రన్స్ టెస్టుల్లో పాసైతేనే, కోరుకున్న కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించగలుగుతారు. అందుకోసం అనేక మంది లక్షలు దారపోసి మరీ లాంగ్ టర్మ్, షార్ట్ కోచింగ్‌లు తీసుకుంటారు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష పట్ల ఎన్‌టిఎ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీ, ఫలితాల వెల్లడి అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇవ్వకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News