భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) తాజాగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. “పిఎస్ఎల్విసి60/స్పేస్డెక్స్ మిషన్లో భాగంగా రెండు ఉపగ్రహాల రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా సోమవారం పూర్తయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ‘ ఎక్స్ ’లో పేర్కొన్నారు. ‘ గత ఏడాది డిసెంబర్ 30న పిఎస్ఎల్వి సి60/ స్పేడెక్స్ మిషన్ను ప్రయోగించాం. ఆ తర్వాత తొలిసారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న విజయవంతంగా అనుసంధానించాం. అదే విదంగా మార్చి 13న వాటిని అన్డాకింగ్ చేశాం. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం” అని కేంద్రమంత్రి వెల్లడించారు. స్పేడెక్స్ మిషన్లో భాగంగా స్పేస్ డీడాకింగ్ను మార్చి 13న ఉదయం 9.20 గంటల సమయంలో విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే.
అంతరిక్ష నౌకలు సొంతంగా డాక్ అయ్యేలా చేయడంలో ఇదో ముఖ్యమైన అడుగు. భూ ఉపరితలం నుంచి నావిగేషన్పై ఆధారపడకుండా .. చంద్రయాన్ 4 లాంటి భవిష్యత్ ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం. మానవ సహిత అంతరిక్షయాత్రలే లక్షంగా ముందుకు సాగుతున్న ఇస్రోకు ఈ సాంకేతికత ఎంతో అవసరం. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్ను ఇస్రో చేపట్టింది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను కక్ష లోకి పంపించింది. పలు ప్రయత్నాల అనంతరం చివరకు జనవరి 16న ఉదయం 6.20 గంటల ప్రాంతంలో డాకింగ్ ప్రక్రియ (స్పేడెక్స్) విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.