అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి( ఐఎస్ఎస్)కు చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూపు కెప్టెన్ శుభాంశు శుక్లాను మన దేశం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం యాక్సియమ్ మిషన్4లో భాగంగా శుక్లా వచ్చే నెల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. అక్కడ 14 రోజుల పాటు గడపనున్న శుక్లా కనీసం ఏడు ప్రయోగాల్లో పాలు పంచుకోన్నుట్లు సమాచారం. అంతరిక్షంలో పంటల సాగు, వాటర్ బేర్( నీటి ఎలుగుబంటి) గురించి అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. టార్డిగేర్, సూకణ జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై జీవిచే అత్యంత అరుదైన జీవి.దాదాపు 600 మిలియన్ సంవత్సరాలుగా ఉంటున్నట్లుగా చెప్తున్న 0.3నుంచి 0.5మిల్లీ మీటర్ల పొడవుండే ఈ జీవి పర్యావరణంలో అత్యంత కఠినమైన మార్పులను సైతం తట్టుకొనగలిగిన డిఎన్ఎను కలిగి ఉంటుంది.
ఇలాంటి అరుదైన జీవి డిఎన్ఎను డీకోడ్ చేసిన ఇస్రో.. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో పునరుత్పత్తిని, భూమి, అంతరిక్షంలో జన్యు మార్పిడిని అధ్యయనం చేయనుంది. అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ శక్తి కలిగిన వాతావరణంలో ఈ జీవిడిఎన్ఎలో కలిగే మార్పులకు అనుగుణంగా వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను రూపొందించనుంది.ఈ అధ్యయనం త్వరలో జరపబోయే మానవ సహిత గగన్యాన్కూ ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తోంది. అలాగే ఈ యాత్రలో భాగంగా అంతరిక్షంలో కంప్యూటర్ స్క్రీన్లను ఉపయోగించడం వల్ల కలిగే మార్పులనూ అర్థం చేసుకోనున్నారు. మైక్రో గ్రావిటీలో గేజ్ ఫిక్సేషన్, కంటిని వేగంగా కదిలించడం వల్ల ఒత్తిడి స్థాయిలు ఏ విధంగా ఉంటాయో కూడా పరిశీలించనున్నారు. భవిష్యత్తు అంతరిక్ష నౌకల్లో కంప్యూటర్ల రూపకల్పనకు ఇది దోహదపడుతుంది. అలా శుక్లా మొత్తం ఏడు పరిశోధనలు చేయనున్నారు.