జమ్ముకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నుంచి ఓ సెలబ్రిటీ జంట తృటిలో తప్పించుకుంది. మరికొంత సమయం అక్కడే ఉంటే.. వారు కూడా ప్రాణాలు కోల్పోయేవారు. మంగళవారం మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రావాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నటి దీపికా కాకర్ తన భర్త షోయబ్ తో కలిసి విహారయాత్రకు కాశ్మీర్ వెళ్లారు. అయితే, ఉగ్రదాడికి ముందే ఆ ప్రాంతం నుంచి వచ్చేశారు. దీంతో వారు ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు.
ఈ దాడికి ముందే.. అక్కడ అందమైన ప్రదేశాల్లో దిగిన ఫోటోలు, వీడియోలను ఆదివారం అభిమానులతో పంచుకున్నారు. దాడి తర్వత వీరికి ఏమైందోనని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మేం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం’’ అని ఇన్స్టాలో తెలిపారు. దీంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.