రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ గ్రామ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకోవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకుని, సాధికారతకు, స్వయం సమృద్ధి కి నిర్వచనంగా మారిందని వెల్లడించారు. మాల్ పంచాయతీ ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసిన అధికారులను మంత్రి సీతక్క అభినందించారు. మాల్ ఆదర్శంగా ప్రతి గ్రామపంచాయతీ ఎదగాలని ఆకాంక్షించారు.
బీహార్లోని మధుబనీలో గురువారం జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డును జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డిలతో కూడిన అధికారుల బృందం స్వీకరించనుందని మంత్రి బుధవారం హైదరాబాద్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు కింద రూ.కోటి ప్రోత్సాహక బహుమతి లభించనుంది. ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు ఇస్తారు. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను మాల్ గ్రామపంచాయతీ సమకూర్చుకుంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి రూ.90 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోందని మంత్రి ఆ ప్రకటనలో వివరించారు.