ఇప్పటికే 400 పేజీల రిపోర్టు సిద్ధం
ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్టును అడిగిన కమిషన్
మన తెలంగాణ / హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నది. గురువారం కమిషన్ కార్యాలయానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ తుది దశ విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు జరిపిన విచారణల ద్వారా వచ్చిన సమాచారంతో సుమారు 400 పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో దాదాపుగా తొంబై శాతం రిపోర్టు పూర్తి అయినట్లుగా భావిస్తున్నారు. తుది నివేదిక రూపకల్పనలో దేశంలో చోటుచేసుకున్న కొన్ని కీలక కేసుల సారాంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా భావిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డిఎస్ఎ) రిపోర్టును ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ ఎన్డిఎస్ఎ కు లేఖ రాసింది. ఫైనల్ రిపోర్టు ఇచ్చేందుకు మూడు వారాల గడువును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డిఎస్ఎ) కోరినట్లు తెలిసింది.మే తొలివారంలో పాత ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సిఎం కె.చంద్రశేఖర్రావు, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, నాటి ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులకు కమిషన్ నోటీసులు ఇచ్చి వారిని విచారించే అవకాశం లేకపోలేదు.