మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి ఘటనకు బాధ్యులైన నిర్మాణ సంస్థలు, ఇంజనీర్లపై చర్యలకు రంగం సిద్దం అయ్యింది. మేడిగడ్డ కుంగిన సంఘటపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికలో పలు సిఫార్సులు చేసింది. అందులో బాగంగా మేడిగడ్డ కుంగిన అంశంపై దాదాపు యాబై మంది ఇంజినీర్లపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డిఎస్ఏ) నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఎన్డిఎస్ఏ నివేదికలో ని అంశాలు ఆందోళన కలిగించేరీతిలో ఉన్నాయి.
ప్లానింగ్, డిజైనింగ్ లోపాలతో పాటు నిర్మాణ లోపాలు కూడా ఉన్నాయంటూ వాటి కొన్ని నిర్మాణాలను మొత్తం కూల్చివేయాలని ఎన్డిఎస్ఏ తన నివేదికలో పొందుపరచడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు, మరో ముప్పై మంది ఇంజినీర్లపై శాఖపరమైన చర్యలకు సిఫార్సులు అంశాలున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగిన సంఘటనలో కొంత మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సిఫార్సుచేసింది. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణసంస్థ ఎల్ అండ్ టీపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది.