Tuesday, October 8, 2024

హర్యానాపై ముద్ర వేయలేకపోయిన ఆప్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా విఫలం
కాంగ్రెస్‌తో పొత్తు యత్నం ఫలించలేదు
90 సీట్లకూ పోటీ చేసిన ఆప్

చండీగఢ్ : అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో తన ముద్ర వేయాలని ఆకాంక్షించిన ఆప్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. ఆప్ పరాజిత అభ్యర్థుల్లో పార్టీ రాష్ట్ర శాఖ సీనియర్ ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా కూడా ఉన్నారు. కైతాల్ జిల్లా కలాయత్ స్థానం నుంచి పోటీ చేసిన ధండా ఏడవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ సహారన్ గెలిచారు. ఎన్నికల కమిషన్ (ఇసి)డేటా ప్రకారం రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో ఎక్కడా ఒక్క ఆప్ అభ్యర్థి కూడా పోటీ ఇవ్వలేకపోయారు.

ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆప్ ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కూడా హర్యానాలో విజయం సాధించలేకపోయింది. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆప్ ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. తాను మూడు నాలుగు నెలలకు ముందు జైలు నుంచి విడుదలై ఉంటే ఎన్నికల తరువాత రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు. ‘హర్యానాలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా అది జరిగేది ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే’ అని ఆయన ప్రకటించుకున్నారు.

ఆరోపిత ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన సిబిఐ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత సెప్టెంబర్ 13న కేజ్రీవాల్ తీహార్ జైలులో నుంచి విడుదల అయ్యారు. ఆయన జైలులో ఐడు నెలలు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఆప్ కాంగ్రెస్‌తో పొత్తుతో కురుక్షేత్ర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. కానీ ఆప్ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుశీల్ గుప్తా బిజెపికి చెందిన నవీన్ జిందాల్ చేతిలో సుమారు 29 వేల వోట్ల తేడాతో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News