Friday, February 7, 2025

కేజ్రీ నివాసంలోకి ఎసిబి బృందం ప్రవేశానికి అడ్డుపుల్ల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై ఆప్ చీఫ్ చేసిన ముడుపుల ఆరోపణలపై ఆయనను ప్రశ్నించేందుకు ఎసిబి బృందం ప్రయత్నించినప్పుడు వారికి ఆయన నివాసం లోపలికి వెళ్లనివ్వలేదు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు వోట్ల లెక్కింపుజరగడానికి ముందు రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. బిజెపిపై ఆప్ చేసిన ‘ఆపరేషన్ లోటస్’ ఆరోపణపై దర్యాప్తు నిర్వహించాలని ఎసిబిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా ఆదేశించారు. కేజ్రీవాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక న్యాయవాది ఎసిబికి ఈ చర్య తీసుకునేందుకు అధికారం లేదని స్పష్టం చేశారు.

‘వారి వద్ద ఎటువంటి పత్రాలూ లేవు. రాజకీయ ప్రహసనం సృష్టికి బిజెపి పన్నిన కుట్ర ఇది’ అని ఆయన ఆరోపించరు. పార్టీ ఫిరాయించేందుకు తమ అభ్యర్థులకు బిజెపి రూ. 15 కోట్లు ఇవ్వజూపిందన్న ఆప్ ఆరోపణ ఈ వివాదానికి మూలం. తమ అభ్యర్థుల్లో 16 మందికి పార్టీ మారినట్లయితే ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేశారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇంతకుముందు ఆరోపించారు. ఆప్ ఆరోపణలపై ఢిల్లీ బిజెపి కార్యదర్శి విష్ణు మిత్తల్ ఫిర్యాదు చేసిన తరువాత ఎల్‌జి ఎసిబి దర్యాప్తునకు ఆదేశించారు. ‘అర్వింద్ కేజ్రావాల్, సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలు ఎంతో తీవ్రమైనవి. తక్షణ దర్యాప్తు జరిపించవలసినవి’ అని మిత్తల్ ఎల్‌జి సక్సేనాకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు తమ ఆరోపణల ధ్రువీకరణకు ఎటువంటి రుజువులూ లేదా ఆధారాలూ చూపలేదని మిత్తల్ తెలిపారు.‘ఎన్నికలు రెండు రోజుల క్రితం ముగిసాయి.

అటువంటి తప్పుడు. తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి ద్వారా ఆయన ఢిల్లీలో భయాన్ని, అశాంతిని సృష్టించే యత్నం చేస్తున్నారు’ అని బిజెపి నేత ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తునకు ఎసిబిని నియోగించవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు మిత్తల్ విజ్ఞప్తి చేశారు. ఆ ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించవలసిందిగా ఎసిబిని సక్సేనా ఆదేశించారని ఆ వెంటనే ఎల్‌జి ప్రిన్సిపల్ కార్యదర్శి ఆశిష్ కుంద్రా ఒక ప్రకటనలో తెలియజేశారు. కాగా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ. ‘మేము ఆరోపణలపై చర్య కోరుకుంటుండగా, బిజెపి నాటకం ఆడాలని అనుకుంటోంది’ అని విమర్శించారు. ‘ఎసిబిని దర్యాప్తు నిర్వహించనివ్వండి. ఒక ఫిర్యాదు దాఖలు చేయడానికి నా న్యాయవాదితో కలసి ఎసిబి కార్యాలయానికి వెళుతున్నాను’ అని సంజయ్ సింగ్ చెప్పారు. ఆప్ అభ్యర్థులకు ఆఫర్ చేసినవారి ఫోన్ నంబర్ ప్రస్తావించానని సంజయ్ సింగ్ చెబుతూ, ఇంకా ఏమి సాక్షాధారాలు కావాలని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News