జగిత్యాల జిల్లా ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అకౌంటెంట్ రఘు ఓ వ్యక్తి వద్ద రూ.7 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే…కోరుట్లకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ పవన్కుమార్ సిపిఎస్ డబ్బులు రూ.1.4 లక్షల కోసం ట్రెజరీలో దరఖాస్తు చేసుకున్నాడు. ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ రఘు కానిస్టేబుల్ను డబ్బులు డిమాండ్ చేయగా, డబ్బులు తన ఖాతాలో పడగానే రూ.7 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. కాగా, డబ్బులు ఖాతాలో పడినా తనకు
ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం లేదని అకౌంటెంట్ రఘు తరచూ కానిస్టేబుల్కు ఫోన్ చేసి సతాయిస్తున్నాడు. దాంతో కానిస్టేబుల్ ఎసిబి అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. ఎసిబి అధికారుల సూచన మేరకు పవన్కుమార్ శుక్రవారం ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి అకౌంటెంట్కు ఏడు వేల రూపాయలను ఇవ్వగా అక్కడే మాటు వేసిన ఎసిబి అధికారులు లంచం తీసుకున్న రఘును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని ఎసిబి కోర్టులో హాజరు పరిచేందుకు తమ వెంట తీసుకెళ్లారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్పి రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.