రాష్ట్రంలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం కెసిఆర్ అని, బిఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని విధాల నాశనం అయ్యిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. బుధవారం అద్దంకి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కెసిఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఈ స్థితిలో ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే విఫలం చెందిందని కెసిఆర్ మాట్లాడుతున్నారని, అన్ని వైఫల్యాలకు అసలు కారణం కెసిఆర్ అని ఆయన ఆరోపించారు. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చామని ఆయన మాట్లాడుతున్నారని, కానీ, దళితుడిని సిఎం చేస్తానన్న హామీ నుంచి ఉద్యోగాల వరకు ఇచ్చిన అన్నింటిని గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. బిసిలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తేవాలన్న ఆలోచన వారికి పదేళ్లలో రాలేదని, తాము వచ్చిన సంవత్సరంలోనే దానిని అమలు చేశామని ఆయన తెలిపారు.
అలాగే ఎస్సీ వర్గీకరణపై నాన్చుడు ధోరణి ప్రదర్శించి, మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టారని, కానీ, కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే ఇది చేసిందని ఆయన అన్నారు. అంతేగాక ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయని, అవి మీకు కనిపించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కెసిఆర్ అసెంబ్లీ రావడం లేదని ఆరోపణలు నేపథ్యంలోనే రెండు రోజులు వచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నారని, కానీ, ప్రతిపక్ష నాయకులుగా కెసిఆర్ సంపూర్ణంగా ఫెయిల్ అయ్యారని ఆయన విమర్శించారు. ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీ సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టించి, ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇప్పుడు మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు.