‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా ’ఆదిత్య 369’. ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు. ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…“ఈ చిత్రాన్ని 4కెలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి మార్చాము. ప్రసాద్స్ డిజిటల్ టీం ఆరు నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారు. 34 ఏళ్ళ క్రితం జూలై 18, 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. రీ రిలీజ్ చేస్తామని ప్రకటించగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా.
’ఆదిత్య 369’ చిత్రాన్ని నేను నిర్మించడానికి నాకెంతో సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి జీవితాంతం రుణపడి వుంటాను. ఇంత గొప్ప ప్రాజెక్టు నాకు ఇచ్చి నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లు ఎక్కించిన నందమూరి బాలకృష్ణకి, సింగీతం శ్రీనివాసరావుకి ఇలా రీ రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఆనందపడ్డారు. అప్పట్లో నేను కొత్త నిర్మాత అయినా సరే నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బాలయ్య బాబుకి సదా కృతజ్ఞుడిని. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్గా… రెండు పాత్రల్లోనూ ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాలో చాలా అందంగా కనపడతారు. ఆయన నటనలో రాజసం ఉట్టిపడుతుంది. కథకుడిగా, దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిత్రమిది. ఇటువంటి కథా ఆలోచన ఆయనకు రావడమే కాదు, తెలుగు తెరపై అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఈ సినిమాని తీర్చిదిద్దారు.
ఇళయరాజా సంగీతం, జంధ్యాల మాటలు, ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పీసీ శ్రీరామ్, వీఎస్ఆర్ స్వామి, – కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. బాలీవుడ్ టాప్ విలన్ అమ్రిష్ పురి, ప్రముఖ నటుడు టినూ ఆనంద్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు” అని అన్నారు.