కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంతే ధీటుగా కరోనా నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిత్య మ్యూజిక్ సంస్థ కరోనా నివారణకు తమ వంతుగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా, దినేష్ గుప్తా, ఆదిత్య గుప్తాలు రాష్ట్ర మంత్రి కెటిఆర్ను కలిసి కరోనా నివారణ చర్యలకుగాను సిఎం రిలీఫ్ ఫండ్కు 31 లక్షలు విరాళాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ గుప్తా మాట్లాడుతూ “కరోనా కారణంగా యావత్ మానవాళి ఇబ్బందుల్లో పడింది. ఈ మహమ్మారి నివారణకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు అభినందనీయం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్కి సహకరిస్తూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనా వ్యాప్తిని అరికట్టాలి”అని అన్నారు.