లండన్ : బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది. “ ఆగాఖాన్ కుటుంబానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నాం. ప్రపంచం లోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్టుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. ” అని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన మరణవార్త కింగ్ చార్లెస్ 3 కి తీవ్ర మనస్తాపం కలిగించినట్టు తెలుస్తోంది.
ఆయనకు కింగ్ చార్లెస్ 3. ఆయన తల్లి దివంగత క్వీన్ఎలిజెబెత్ 2 కు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆగాఖాన్ స్విట్జర్లాండ్లో జన్మించారు. 20 ఏళ్ల వయసు 1957 లోనే ఇస్మాయిలీ ముస్లింల 49 వ వంశపారంపర్య ఇమామ్గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముఖంగా నిర్వహించే రేసు గుర్రాల్లోనూ ఆయన పాల్గొనేవారు. 1967 లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ను స్థాపించారు. ఇది ప్రపంచం లోనే వందలాది ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది. ఆయన సేవలకు గాను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది.