Monday, July 8, 2024

ప్రయాణికులకు కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రాఖీ పౌర్ణమి పర్వదినం రోజున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) సరికొత్త రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసి చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డుగా అధికారులు తెలిపారు. అధిక రాబడి రావడానికి సహకరించిన ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండి విసి సజ్జనార్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఈ సారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసిల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదని, గతేడాది రాఖీ పండుగ రోజున 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నమై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారన్నారు. అందుకు రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తున్నారని వారు కితాబునిచ్చారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది త్యాగం ఎనలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి భవిష్యత్ లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలని చైర్మన్, ఎండిలు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News