Tuesday, March 11, 2025

ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

- Advertisement -
- Advertisement -

ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో సాగునీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన ప్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలను వారు చర్చించారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో ఐదవ పంపు ఏర్పాటు చేసుకునే పనులు పూర్తి చేయాలని వారు అధికారులనుఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పూర్తిగా అధ్యయనం చేసి గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్ ను పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలన్నారు. గోదావరి పరిధిలో బస్వాపూర్ మొదలు సింగూరు వరకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం – ఏదుల కాలువలు గుర్తు చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి బట్టి అధికారులను ఆదేశించారు.

డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఇరువురు మంత్రులు సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న భూ సేకరణ, పాత ప్రాజెక్టుల నిర్వహణ, క్యాపిటల్ వర్క్ పై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించుకోవడం, కాలువలకు లైనింగ్ పనులు నిర్వహించడం ద్వారా ప్రాజెక్టుల జీవితకాలపరిమితి పెరుగుతుందని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. గత పది సంవత్సరాల పాటు పరిపాలించిన వారు కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించి మిగతావాటి నిర్వహణ అంశాలను గాలికి వదిలేయడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైందని వివరించారు. పాత ప్రాజెక్టులను కాపాడుకునేందుకు మెయింటెనెన్స్ పనులు చేసుకుంటూనే, కేంద్ర నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలను త్వరితగతిన పరిశీలించాలని అధికారులకు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక లీగల్ టీం ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టుల గేట్ల మరమతులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వలను బలోపేతం చేసుకునే పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీ రేట్లు కు అప్పులు తీసుకురావడం వల్ల ఆ భారం ప్రస్తుత ఖజానా నిర్వహణపై పడుతుందని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఈ పథకం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్, ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి, ఈఎస్సీ (ఆపరేషన్, మెయింటెనెన్స్) విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News