మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చవద్దని, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్తో పాటు మరో నాలుగు పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ను నివారించేందుకు, పర్యావరణ పరంగా కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణి లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేశారు.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్కు ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్దిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులను రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. రూ.580 కోట్లతో మొదటి ప్యాకేజీలో కేబీఆర్ పార్కు ఎన్ట్రెన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్దజంక్షన్ రెండు స్టీల్ బ్రిడ్జీలు, మూడు అండర్ పాసులను నిర్మించనున్నారు. రూ.510 కోట్లతో రెండో ప్యాకేజీలో రోడ్డు నెం.45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హస్పిటల్ జంక్షన్లలో నాలుగు స్టీల్ బ్రిడ్జీలు, నాలుగు అండర్ పాసులను నిర్మించనున్నారు.