Saturday, July 6, 2024

అమరావతి ప్రజా రాజధాని

- Advertisement -
- Advertisement -

అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగుజాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు.? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి తేటలు గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడుల కోసం ప్రపంచం వ్యాప్తంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. “రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుదని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు ఎంతో పరిశీలన చేశాక చరిత్ర సృష్టిస్తుందని అమరావతి పేరును సూచించారు.

దానికి రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుండి నీరు, మట్టి తెచ్చాం. దేశంలోని అన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చాం. కొంతమంది అమరావతే రాజధానిగా ఎందుకు ఉండాలని అడుగుతున్నారు…కుప్పం వారికైనా…ఇచ్చాపురం వారికైనా సమదూరంగా అమరావతి ఉంటుంది. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరు. రాజధానికి రెండు వైపులా 12 చొప్పున పార్లమెంట్ లు ఉన్నాయి. విభజన అనంతరం శివరామృష్ణ కమిటి రాష్ట్రంలో పర్యటిస్తే…కృష్ణా, గుంటూరు లేదా ఆ రెండు జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది తమ అభిప్రాయాలను చెప్పారు. అప్పటికే రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉంది. సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించాం. హైదరాబాద్ కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవు…రానురాను అన్నీ కలిసొచ్చాయి. ఎంతో మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చాం.

14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ గురించి వివరించి పరిశ్రమలు తీసుకొచ్చాం. పెద్దపెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం. నా హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశా. అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా అని అనుమానపడ్డాం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను రైతులు ముందుకొచ్చి ఇచ్చారు. పదేళ్ల పాటు రైతులకు కౌలు ఇవ్వాలని నిర్ణయించాం. వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందించాం…ఈ నెల 1వ తేదీనే దాన్ని రూ.5000కు పెంచి అందించాం. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా సరే అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాల్సిందే.” అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పన…
“రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుంది. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి కూడా రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించాం. కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపు ఇచ్చింది. రూ.2,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుని రూ.1500 కోట్లు కూడా అందించింది. రాష్ట్రం నడిమద్యలో రాజధాని ఉండాలని నాడు అసెంబ్లీలో జగన్ అన్నారు. నేను ఇల్లు కట్టుకున్నా…మీరు కట్టుకోలేదు అని నన్ను అన్నారు. కానీ తర్వాత ఏం నిర్ణయాలు తీసుకుని ఎలా మాటలు మార్చారో అంతా చూశాం. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జెఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయి. సింగపూర్ తో ఎంఓయూ కుదుర్చుకున్నాం.

మొదట సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ అందించింది. నవ నగరాలకు రూపకల్పన చేసి మాస్టర్ ప్లాన్ అందించారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి నగరంగా ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించాం. పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన కేంద్రంగా నిర్ణయించాం. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలని రూపొందించాం. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ తో పాటు అన్ని విభాగాలు ఒక చోట ఉండాలని మాస్టర్ ప్లాన్ లో నిర్ణయించాం. ఇందులో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఏ సిటీకి కి.మీ మేర నదుల అవకాశం లేదు…కానీ అమరావతికి ఉంది. రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్ తో రూపకల్పన చేశాం. రూ.51,687 కోట్లతో రాజధానులకు అంచనా వేసి రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచాం. అప్పటికి జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించాం…రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News