తమ దేశ పౌరులకు అమెరికా హితవు
వాషింగ్టన్ : జమ్మూ కశ్మీర్లో హింసాత్మక అశాంతి, అరాచకం నెలకొనే ముప్పు ఉందని అమెరికా హెచ్చరించింది. పహల్గామ్లో ఉగ్రదాడుల తరువాత అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. కశ్మీర్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఆకళింపు చేసుకున్న తరువాత ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికన్లు ఎవరూ ఇప్పుడు జమ్మూ కశ్మీర్లో పర్యటించరాదు. ప్రత్యేకించి పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లరాదని సూచనలు వెలువరించారు.భారత్ పాకిస్థాన్ సరిహద్దులకు పది కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లరాదు. పౌరులను లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగే వీలుంది. ప్రత్యేకించి సరిహద్దుల వెంబడి చొరబాట్లకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ లోయలోని పలు పర్యాటక కేంద్రాలు , శ్రీనగర్, గుల్మార్గ్ , పహల్గామ్ వంటి ప్రాంతాలలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అక్కడికి వెళ్లితే ముప్పు తప్పదని పౌరులకు విజ్ఞప్తి చేశారు. అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఈ అడ్వయిజరీ వెలువడింది.